ఉపాధ్యాయ దినోత్సవం
నేడు సెప్టెంబర్ 5, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోదర ఉపాధ్యాయినీ - ఉపాధ్యాయ మిత్రులకు శుభాకాంక్షలతో...
భారత దేశపు రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం "సెప్టెంబర్ 5వ" తేదీన మనం ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మొదట ఒక ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరి, ఎంతోమంది విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది, తన ప్రతిభా పాఠవాలతో అంచెలంచెలుగా ఎదిగి, మన దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవికి ఎన్నిక కాబడి ఉత్తమ సేవలందించిన రాష్ట్రపతులలో ఒకరిగా పేరుతెచ్చుకున్నారు. ఒక స్కూల్ టీచర్ రాష్ట్రపతి కావడం మన దేశంలో ఉన్న మనలాంటి టీచర్లందరికీ ఎంతో గర్వకారణం. మన జీవితాల్లో ఉపాధ్యాయుల పాత్రను ఎంతో గొప్పదిగా మన సాంప్రదాయ జీవన విధానంలో ఎప్పుడూ గుర్తించి గౌరవించాము, ఇప్పటికీ కూడా గౌరవించబడుతున్నాము. ఎంతగా అంటే, 'ఆచార్య దేవో భవ’ అని మనం, గురువుని దేవుడితో సమానంగా చూస్తాము. ఎందుకంటే, సాధారణంగా పిల్లలు ఎదిగే సంవత్సరాలలో వారు తల్లిదండ్రుల దగ్గర కంటే కూడా, మన ఉపాధ్యాయుల దగ్గరే ఎక్కువ కాలాన్ని గడుపుతారు. తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపించడానికి వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటంటే, వారి కంటే కూడా పిల్లల మీద మంచి ప్రభావం చూపించగల గొప్ప ఉపాధ్యాయులు ఆ పాఠశాలల్లో కొలువై ఉంటారని ప్రగాఢ విశ్వాసం.
ఉపాధ్యాయుల ప్రాముఖ్యత :
ఒక మనిషిని తీర్చిదిద్దడంలో, ఒక కుటుంబాన్ని ఉన్నత స్థాయికి చేర్చడంలో, ఒక సమాజాన్ని తయారు చేయడంలో, ఒక దేశాన్ని, మొత్తం ప్రపంచాన్ని నిర్మించడంలో ఉపాధ్యాయులకున్న పాత్ర ఎంతో ప్రముఖమైనది. ఒక అంశంపై ఆసక్తిని కల్పించడంలోను, పిల్లల శక్తిసామర్థ్యాలను గుర్తించి, వెలికితీయడంలో వాటిని పెంపొందించడంలో, ఒక ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ప్రభావవంతమైన పాత్రనే పోషిస్తాడు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. చాలా మంది పిల్లలకు ఒక సబ్జెక్ట్ అంటే ఇష్టం లేదా అయిష్టం, ఆ సబ్జెక్టును ఏ టీచరు బోధించారు అన్న దాన్ని బట్టే కలుగుతుంది. అది చెప్పే ఉపాధ్యాయుడిని బట్టి ఉంటుంది. పిల్లలకు ఆ ఉపాధ్యాయుడు నచ్చితే, వారిని ప్రభావితం చేయగలిగితే, అనుకోకుండానే ఆ సబ్జెక్టు వారికి ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది ఆ సబ్జెక్టు మీద అభిమానం పెరుగుతుంది తద్వారా ఆ సబ్జెక్ట్ లో మెరుగైన అభ్యసన ఫలితాలు సాధిస్తారు.
భావితరాలను ప్రభావితం చేయడంలో టీచర్ కు పెద్దగా ప్రాముఖ్యత లేదని ప్రజలు ఈనాటి ఉపాధ్యాయులను చూసి అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ తరం వారి ఆలోచన ప్రకారం ఒక టీచర్ చెప్పగలిగింది అంతా ఇంటర్నెట్ లో దొరుకుతుంది కదా ! ఇక వీరివలన అదనపు ప్రయోజనం ఏముంది అని భావిస్తుంటారు. కానీ నిజానికి టీచర్లకు ఉన్న ప్రాముఖ్యత ఈ రోజులలో మరింతగా పెరిగి పోయిందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్లకి ఇక సమాచారాన్ని అందించవలసిన భారం తీరిపోయింది. వారు చేయవలసిన పని ముఖ్యంగా, వారిలో స్ఫూర్తి కలిగించి, ఒక విద్యార్థిని ఒక మెరుగైన మానవుడిగా, భావి ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్డడం. ఇది ఎప్పుడూ వారు చేయవలసిన ప్రాథమిక కర్తవ్యమే. ఇక టీచర్ అంటే మీకు ఏదో ఒక సమాచారాన్ని అలా చదివేసి వెళ్ళిపోయే టేప్ రికార్డర్ కాదు కదా... ఆయన ప్రేరణ కలిగిస్తూ విద్యార్థుల జీవితాన్ని ఒక నిర్దిష్ట మార్గంలో తీర్చిదిద్దే మార్గదర్శకుడు. ఆయన ఒక వ్యక్తి మాత్రమే కాదు ఒక సమూహాన్ని, సమాజాన్ని సన్మార్గంలో నడిపించే శక్తి.
ఏ దేశాన్ని అయినా యోగ్యమైన రీతిలో నిర్మించాలి అనుకుంటే, అత్యుత్తమమైన సామర్థ్యం ఉన్న వారు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా ఉండాలి. ఒక పిల్లవాడు తన జీవితానికి పునాదిగా భావించబడె వయసులో (ప్రాధమిక విద్యను అందుకుంటున్న దశలో) ఎటువంటి ప్రభావాలకు లోనవుతున్నాడు అన్నది అతని జీవితంలో ఎన్నో విషయాలను నిర్ణయిస్తుంది. కాబట్టి, ఉన్నత శ్రేణికి చెందిన మేధావులు, అత్యుత్తమమైన నిబద్ధత కలిగి, ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, స్ఫూర్తి మంతంగా ఆదర్శవంతంగా ఉండే వ్యక్తులు ఉపాధ్యాయులుగా ఉండాలి. వారి లక్షణాలు, ప్రవర్తన మరియు మార్గదర్శకత్వాన్ని బట్టే విద్యార్ధులు ఉత్తములుగా ఎదుగుతారు. ఒక మంచి సమాజ నిర్మాణానికి బలమైన పునాదులుగా మిగులుతారు. కానీ ఈ రోజుల్లో మనం సామాజిక, ఆర్థిక పరిస్థితులను ఎలా నిర్మించుకున్నామంటే, చాలావరకు తమ ఇష్టంగా కాకుండా, ఎక్కడా ఇతర ఉద్యోగాలు దొరకని వారు, అయిష్టంగా స్కూలు టీచర్లుగా వస్తున్నారు. అలా వచ్చినవారికి విద్యార్ధులను ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో ఆసక్తి ఉండదు కదా... తద్వారా సమాజ నిర్మాణానికి పునాదులు బలంగా వేయలేరు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ఇది మారకపోతే మనం నాణ్యమైన సమాజాన్ని నిర్మించలేము. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మిత మవుతుంది అని కొఠారీ కమీషన్ చెప్పిన మాటలను అబద్దాలుగా చేసినవారమవుతాము. తద్వారా మనం తక్కువ స్థాయి మానవాళిని, తక్కువ స్థాయి సమాజాలను, తక్కువ స్థాయి దేశాలను నిర్మిస్తాము. ఇది ఇప్పటికే జరుగుతోంది. చాలా స్కూళ్లలో, ఉత్తేజితులైన టీచర్లు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటున్నారు. ఇది ఒక "బెల్లు - బిల్లు " ఉద్యోగంగా మారిపోయింది. అవసరమైతే కాస్త ఎక్కువ శ్రమ పడడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఈ విషయంలో మనం తీవ్రంగా విఫలమయ్యాము. ఈ రోజులలో ఉత్సాహవంతులైన ఉపాధ్యాయులు చాలా తక్కువగా ఉన్నారు. తమ బాధ్యతలను మరచి సమాజహితాన్ని మరచి కేవలం యాంత్రికంగా మన ఉద్యోగ జీవితాన్ని కొనసాగిస్తున్నాము.
ఒక టీచర్ అంటే ఉన్నత చదువులకు చెందిన పి.జి డిగ్రీ పట్టాలు నెత్తి మీద నుంచి వేలాడుతూ ఉండాలని కాదు. అతనికి తెలిసింది ఏదో కాస్త చెప్తాడని ఇంకెవరో ఎదురు చూడడం కాదు. ఒక టీచర్ అంటే, అతని సమక్షంలో విద్యార్ధులు ఎన్నో విషయాలను, ఆ టీచరుకు కూడా తెలియనివాటిని కూడా నేర్చుకొనేలా మార్గదర్శనం చేయగలగాలి.
ప్రస్తుతం పాఠశాల అనే కర్మాగారంలో తయారీలో ఉన్న భవిష్యత్ సమాజమే పిల్లలు. వారు మన చేతుల్లో ఉన్నప్పుడు మనం వారిని ఎలా తీర్చిదిద్దుతాము అన్నది ప్రతి ఉపాధ్యాయునికి ఉన్న అతి గొప్ప బాధ్యత మరియు అదృష్టం. మనం చేసే ఏ పని అయినా సరే, మరొక జీవితాన్ని స్పృశించగలిగినప్పుడే అది అర్థవంతమవుతుంది. మరొక జీవితాన్ని తీర్చిదిద్దకలగడం ఎంతో గొప్ప అదృష్టం. మన సొంత పిల్లలతో మనకు ఆ అవకాశం దొరకదు. కానీ ఒక టీచర్ గా అయితే, మనకు ఆ అదృష్టం తప్పక ఉంటుంది. అలాంటి గొప్ప అవకాశాన్ని పొందగలుగుతున్నప్పుడు, మనం ఎంతో గొప్ప మేధావులుగా, ఎంతో చిత్తశుద్ధి కలిగిన వారిగా, విద్యార్థులకు స్పూర్తినివ్వగల వారిగా అయ్యి ఉండటం అన్నది ఎంతో ముఖ్యం. పాఠశాల చిన్నపాటి సమాజంగా భావించి, ఆ సమాజ నిర్మాణ బాధ్యతలను మోస్తున్న సమస్త ఉపాధ్యాయలోకం తమ వృత్తికి పునః అంకితమై మన ఉపాధ్యాయ వృత్తిని ఒక పవిత్రమైన కార్యంగా భావిస్తూ, నిరంతరం మన వృత్తిని ప్రేమిస్తూ, అందరినీ గౌరవిస్తూ, గౌరవించబడుతూ మరింత బాధ్యతాయుతంగా మన విధులు సక్రమంగా నిర్వహించినపుడే మనం అత్యుత్తమ సమాజాన్ని నిర్మించగలుగుతాము. ఆనందంతో సగర్వంగా తలెత్తుకు నిలబడగలుగుతాం. అలా జరిగినపుడే మనం ఉపాధ్యాయ దినోత్సవం నాడు మాత్రమే అందరిచేత గొప్పగా కీర్తించబడటం కాకుండా, జీవితాంతం మన విద్యార్థులు చేత మరియు మనం నివసించే సమాజం చేత గుర్తించి గౌరవించబడతాము తద్వారా ఎనలేని తృప్తిని ఆత్మ సంతృప్తి పొందగలుగుతాము.
మరొక్కసారి మీ అందరికీ "ఉపాధ్యాయ దినోత్సవ" శుభాకాంక్షలతో...
చల్లగాని కృపాబాలానందం
స్కూల్ అసిస్టెంట్ (సాంఘిక శాస్త్రం)
Comments
Post a Comment