ధరీత్రీ దినోత్సవం
ప్రకృతి – మానవాళి – ఆవశ్యకత
భూమి, పృథ్వి, ధరణి…చాలా పేర్లు. మనకు కనిపించే సూర్య మండలంలోఉన్న తొమ్మిది గ్రహాలలో జీవకోటి మనుగడకు అనుకూలమైన ఒకేఒక్క గ్రహం. ఇక్కడ మనం అనే పదం ఉపయోగించడం జరిగింది. ఆ “మనం” అనే పదమే సమస్యకు మొదట బీజం. భూమి మానవ కేంద్రీకృతం అనే భావనలో మానవుడు బతుకుతున్నాడు. కానీ భూమి మీద ఉన్న సకల జీవకోటిలో మనుషులు కేవలం 0.01%, కానీ మానవుడు భూమికి, ప్రకృతికీ చేసే హాని అన్ని జీవ రాశులతో పోల్చితే 98% అని ఒక ప్రముఖ శాస్త్రవేత్త చెప్పడం జరిగింది.
“ ప్రకృతిని కనుగొనడం ద్వారా, మీరు మిమ్మల్ని కనుగొంటారు. ” – మాగ్జిమ్ లగాకే.
చాలా అందంగా రాసిన వాక్యం. ప్రకృతి మన చుట్టూ ఉన్న మొత్తం భౌతిక ప్రపంచం. దీనికి విస్తృత కోణంలో అర్ధం ఉంది. ఇందులో వాతావరణం, పర్యావరణ వ్యవస్థ, వృక్షజాలం, జంతుజాలం మరియు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చి అబ్బుర పరిచే ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. ప్రకృతి మన చుట్టూ ఉన్న అందమైన వాతావరణం, జీవరాశికి తల్లి. మనల్ని పోషిస్తుంది, మనకు మనుగడ కోసం అన్ని అవసరాలను అందిస్తుంది. మనం తినే ఆహారం, మనం పీల్చే గాలి, మనం ధరించే బట్టలు, మనం నివసించే ఇల్లు అన్నీ ప్రకృతి మనకు ఇచ్చిన బహుమతి. దానికి మనం కృతజ్ఞతతో ఉండాలి. ఇక మన దేశానికి వస్తే, సనాతన ధర్మం ప్రపంచ వ్యాప్తి చెందినప్పుడు, ప్రకృతిని, సకల జీవకోటిని ధర్మంలో మమేకం చేశారు. ఆగ్నికి ఒక దేవతా మూర్తిని, మట్టికి, గాలికి, నీరుకి అన్ని భూతాలను దేవుడిలా కొలిచేవారు. పంటలు నాశనం చేసే ఎలుకలను చంపే పాములను నాగరాజులుగా కొలిచారు. గ్రద్దలను గరుత్మంతుడులా, శరీరానికి ఉపయోగ పడే వేపని అమ్మవారిగా, ప్రతీ జీవిలోనూ దైవత్వము ఉందని చెప్పారు. “వృక్షో రక్షతి రక్షితః” అని నొక్కి వక్కాణించారు. “వసుదైక కుటుంబకం” అని పలికారు. వసుదైక అంటే సకల ప్రాణకోటి. ఇప్పుడు మనం కులాలు, మతాలు అని కొట్టుకు చస్తున్నాము కానీ అప్పట్లో గోవులే ఆస్తి, ఆలయాలకు వెళ్తే మనకి అడిగే “గోత్రం” అనే పదంలో గో అంటే గోవు అని, పూర్వీకులు సంపాదించిన పశు సంపద ప్రకారం ఈ గోత్రం వచ్చింది. కానీ తరాలు గడిచే కొద్ది మనిషి లక్ష్మి ని తప్ప మిగతా దేవుళ్ళను మర్చిపోతూ వస్తున్నాడు..
ప్రకృతి ప్రపంచంలోనే అత్యంత అందమైన విషయం. ప్రకృతికి మన ప్రయోజనాల కోసం సృష్టించిన చాలా విషయాలు ఉన్నాయి. దీనిని “మదర్ నేచర్” అని పిలుస్తాము, ఎందుకంటే ఇది మన మనుగడకు, మన రోజువారీ వినియోగానికి ఉపయోగపడే అనేక విషయాలను నిస్వార్థంగా ఇస్తుంది. దానికి బదులుగా, కొంత గౌరవం, ఇంకొంచెం రక్షణ కాకుండా వేరే ఏమీ ఆశించదు. కొండలు, లోయలు, పర్వతాలు, పచ్చదనం, నదులు వంటి ప్రకృతిలో చూడటానికి చాలా అందమైన విషయాలు ఉన్నాయి. ప్రకృతికి, పంచభూతాలు శక్తి స్వరూపాలు. ఎంత శాంతిగా, సున్నితంగా ఉండగలవో అంత ప్రళయము కూడా సృష్టించ గలవు. సూర్యోదయం ఉంది, సూర్యాస్తమయం ఉంది, అకస్మాత్తుగా మేఘావృతమవుతుంది. వర్షం పడుతుంది, కొన్నిసార్లు వేడి కొన్నిసార్లు చల్లగా ఉంటుంది. ఆకాశం దాని రంగులను మారుస్తూ ఉంటుంది, యుద్ధం జరిగినట్టు ఎర్రటి తెర కప్పుతుంది. కొన్ని సార్లు కారు మేఘాలతో ప్రళయం ముంచుకొస్తునట్టు అనిపిస్తుంది. నిరాశతో బాధపడుతున్న చాలా మంది రోగులు లేదా మరే ఇతర తీవ్రమైన వ్యాధులు వారు ప్రకృతితో మమేకమైనపుడు కోలుకుంటారు. ప్రకృతిలో ఒక రకమైన positive energy(సానుకూల శక్తి) ఉంటుంది. ఆహ్లాదకరమైన, ప్రశాంత వాతావరణంలో ప్రకృతి సౌందర్యాన్ని పొందుతారు. అందువల్ల ప్రకృతి మన భౌతిక అవసరాలకు మాత్రమే కాకుండా, మన మనశ్శాంతికి, మనకు అంతిమంగా ఆనందం మరియు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రకృతి సౌందర్యాన్ని నాశనం చేయకూడదు. దానిని పరిరక్షించడానికి కృషి చేయాలి. ప్రకృతిలో ఉన్న అనేక చెట్లు మానవులకు వివిధ మార్గాల్లో అనేక ప్రయోజనాల కోసం రోజువారీ ఉపయోగాలు కోసం, ఔషధ ప్రయోజనాల కోసం సహాయపడతాయి. మానవ జీవితాన్ని వివిధ మార్గాల్లో సహాయం చేయడానికి, పోషించడానికి ప్రకృతికి శక్తి ఉంది.
ప్రకృతి గురించి ఒక గొప్ప రచయిత, హేతువాది అయిన ఎమెర్సన్ ఒక నైరూప్య సమస్యను పరిష్కరించడానికి ఈ విధంగా చెప్పాడు: “ప్రకృతి సౌందర్యాన్ని మానవులు పూర్తిగా అంగీకరించరు. ప్రపంచం యొక్క ఆధిపత్య పోకడ వలన ప్రజలు పరధ్యానంలో ఉన్నారు. అయితే ప్రకృతి నిస్వార్థంగా ఇస్తుంది కాని మానవులు పరస్పరం విఫలమవుతారు. ప్రకృతి వస్తువు, అందం, భాష, క్రమశిక్షణ, ఆదర్శవాదం, ఆత్మ మరియు అవకాశాలు అనే ఎనిమిది విభాగాలను కలిగి ఉంటుంది. ప్రతి విభాగం మానవులు మరియు ప్రకృతి మధ్య సంబంధంపై భిన్న దృక్పథాన్ని అవళంబిస్తుంది. మనం సహజంగా ప్రకృతిలో సంపూర్ణతను అనుభవించాలంటే, సమాజం మనపై విధించిన మనకు తెలియని కొన్ని షరతుల నుండి మనం వేరుగా ఉండాలి”అని ఎమెర్సన్ వ్యాసంలో వివరించాడు. ఏకాంతం అనేది ప్రకృతి ప్రపంచంలో మనం పూర్తిగా నిమగ్నమయ్యే ఏకైక యంత్రాంగం అని ఎమెర్సన్ నమ్మాడు, “ఏకాంతంలోకి వెళ్ళడానికి, మనిషి తన గది నుండి సమాజం నుండి విరమించుకోవాలి. మనిషి ఒంటరిగా ఉంటే, అతను నక్షత్రాలను చూస్తాడు. ఒక వ్యక్తి నిజమైన ఏకాంతాన్ని అనుభవించినప్పుడు, అది అతన్ని లీనం చేసుకుంటుంది. సమాజం మనలో ఉన్న సంపూర్ణతను నాశనం చేస్తుంది. అయితే “ప్రకృతి, మనిషి చేసిన పరిచర్యలో, పదార్థం మాత్రమే కాదు, ప్రక్రియ మరియు ఫలితం కూడా. ప్రకృతిలో భాగమైన మనుషులు కూడా ఇతర అనేక జీవులవలె పంచభూతాల లాగా నిస్వార్ధంగా ఒకరికోసం ఒకరు నిరంతరం పనిచేయాలి. గాలి విత్తనాన్ని విత్తుతుంది; సూర్యుడు సముద్రాన్ని ఆవిరి చేస్తాడు; గాలి ఆవిరితో పొలంలోకి వీస్తుంది; దీనిపై వర్షాన్ని ఘనీభవిస్తుంది; వర్షం మొక్కకు ఆహారం ఇస్తుంది; మొక్క జంతువుకు ఆహారం ఇస్తుంది; స్వచ్ఛందంగా మనిషి యొక్క అంతులేని ప్రసరణ కోసం ప్రకృతి పరితపిస్తుంది.
భూమిని కాపాడటం అవసరం అని చెప్పడం ఒక సాధారణ విషయం. దురాశ మరియు స్వార్థంతో నడిచే మానవుల కార్యకలాపాలన్నీ భూమికి అపారమైన నష్టాన్ని కలిగించాయి. ఇపుడు మరమ్మత్తులు చేసే సమయం దాటేసింది. ఇక కొత్తగా ఇపుడు ఎలాంటి వినాశనం జరగకుండా మాత్రమే మనిషి చెయ్యగల ఏకైక పని.
ప్రకృతి అనగానే మనకి గుర్తొచ్చేది అందమైన పచ్చని చెట్లు, కొండ కోనలు, కానీ ఇంకొక పదం కూడా గుర్తొస్తుంది, అదే వికృతి. ప్రకృతిని వికృతి చేసే పనిలో మానవుడు తల మునకలై ఉన్నాడు. దానిలో భాగంగా పుట్టుకొచ్చిందే “Global Warming”, అనగా భూతాపం పెరిగిపోవడం. ఇప్పుడు మనుషులు ఎదురీదుతున్న చాలా అంశాలకు మూల కారణం ఇదే..!!! భూకంపం అయినా, వరదలు అయినా, సునామీలు అయినా.. చివరికి రైతు పొలంలో పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నా కూడా ఇదే పరోక్షంగా కారణం, (వర్షాలు సమయానికి కురవడం లేదు కాబట్టి!) అభివృద్ధి అనే పదానికి కొత్త అర్థం జోడించి ప్రకృతిని నాశనం చెయ్యడమే అభివృద్ధి అన్నట్టు ప్రభుత్వాలు నడుచుకుంటున్నాయి. ఈ కార్యకలాపాల వల్ల దాదాపు అన్ని సహజ వనరులు ఇప్పుడు కలుషితమవుతున్నాయి. ఈ వనరులన్నీ ముప్పులో ఉన్నప్పుడు, సహజంగానే అన్ని జీవుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. అందువల్ల మనం భూమిని కాపాడుకోవాలి. మిగతా సమస్యలన్నీ ద్వితీయమైనవి, భూమిని రక్షించడమే ప్రధాన కర్తవ్యంగా మనం భావించాలి.
భూమి ఎప్పుడూ ఉంటుంది, ఇంకా మన తరువాత చాలా తరాలు రానున్నాయి. ఇతర సమస్యలు స్వయంచాలకంగా పోతాయి. ఈ విశ్వంలో జీవనం కొనసాగించగల ఏకైక గ్రహం భూమి. మనకు ఇంకొక భూమి లేదు. ప్రభుత్వాలు ఇప్పుడు కఠినమైన చర్యలు తీసుకోకపోతే, మన భవిష్యత్ తరాలు శాశ్వతంగా అభివృద్ధి చెందే అవకాశాన్ని కోల్పోతాము. ప్రతి ఒక్కరూ ఒకే లక్ష్యం కోసం కలిసి రావాలి, ఎందుకంటే మనం మొదట ఈ గ్రహం యొక్క నివాసితులం, తరువాతే మరేదైనా. ఒక వైపు ప్రతీ ఏటా ప్రకృతి వైపరీత్యాలకు కొన్ని వేల కోట్లు బడ్జెట్లో పక్కన పెడతారు. మరో వైపు తీరాన్ని కంటికి రెప్పలా ఒక సైనికుడిలా కాపాడే మడ అడవులను నరుకుతారు. మనుషులు నివాస ప్రాంతాలలో విష వాయువులు చిమ్మే పరిశ్రమలకు అనుమతులు ఇస్తారు, ప్రమాదం జరిగి ప్రాణాలు పోతే డబ్బుతో కప్పి పుచ్చుతారు. ఇవే తిన్నగా NGT ట్రిబ్యునల్ ప్రాతిపదికన చేసి వనరులకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే, ఆ వేల కోట్లు వేరే దేనికైనా ఉపయోగపడతాయి. ప్రభుత్వాల వెసులుబాటు కోసం పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా ఒక రాజకీయ శాఖగా అయిపోయింది. ఈరోజు ఎలాంటి పరిశ్రమలకు అనుమతులు లేని అటవీ ప్రాంతం రేపటికి పూర్తి అనుమతులతో పనులు ప్రారంభిస్తుంది.
ప్రభుత్వాలు, మనుషులు ఎవరికీ వారు అంటనట్టు ముట్టనట్టు ఉంటే ఇక భవిష్యత్తు తరాలని అంధకారంలోకి నెట్టిన అపవాదు మనం తీసుకోవలసి వస్తుంది.. సాధారణంగా ఉప్పునీటిలో ఏ మొక్కలు జీవించలేవని మనం అనుకొంటాం. కాని ఉప్పు నీటిని తట్టుకునే వృక్షాలు కూడా చాలా ఉన్నాయి. ఈ మొక్కల్లో చాలా వాటికి ఔషద గుణాలున్నట్లు పరిశోధనల్లో వెల్లడయింది. మడ అడవులు సముద్రం నుంచి ఎదురయ్యే పెనుగాలులు, తుపానులు, ఆటుపోట్లు, సునామీ వంటి ప్రమాదాల నుంచి కాపాడుతూ ఒక సహజ రక్షణ కవచంలా ఉంటున్నాయి. నానాటికి తరిగిపోతున్న జీవవైవిధ్యాన్ని ఇవి సంరక్షిస్తున్నాయి. ఎంతో వైవిధ్యభరితమైన జీవరాశులకు ఇవి ఆటపట్టుగా ఉన్నాయి. వలసపక్షులు గూళ్ళు కట్టుకునేందుకు, సముద్రజీవుల సంతానోత్పత్తికి ఈ అడవులు అనువుగా ఉంటాయి. నీటిలోని మాలిన్యాలను, హాని కలిగించే భారలోహాలను శోషించుకుని నీటిని శుద్ధి చేస్తాయి. అలాగే గాలిలోని కాలుష్యాలను శోషించుకుని గాలిని కూడా శుద్ధి చేస్తున్నాయి.
ప్రకృతి ఎందరినో గేయ రచయితలను, చిత్రకారులను చేసింది, మరెందరినో గొప్ప ప్రపంచ ప్రసిద్ధి చెందిన కవులను చేసింది. అందులో ఒకరు రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన మాటల్లో “ రేకుని తుంచి, పువ్వు యొక్క అందాన్ని ఎప్పటికీ ఆశ్వాదించలేరు .” అలాగే ప్రకృతిని నాశనం చేసి మానవులు తమ జీవితాలను ఆనందంగా ఆశ్వాదించలేరు.
కావున
" పకృతిని పరిరక్షిద్దాం - జీవ వైవిద్యాన్ని కాపాడుకుందాం."
"ప్రకృతిలో మమేకమవుదాం - ప్రశాంతంగా జీవించుదాం."
చల్లగాని కృపాబాలానందం
సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు.
Comments
Post a Comment